మంచితనమే శాపమైన వేళ.. లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి దోచేశారు! | Sakshi
Sakshi News home page

మంచితనమే శాపమైన వేళ.. లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి దోచేశారు!

Published Fri, Nov 18 2022 10:21 AM

Accused Who Made Google Pay By Threatening To Kill    - Sakshi

విజయనగర్‌కాలనీ(హైదరాబాద్‌): లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ ఆర్‌.జి.శివమారుతి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రాయణగుట్టకు చెందిన కె.జయంత్‌ ప్రైవేటు స్కూల్‌ టీచర్, ఈ నెల 6న సాయంత్రం రాజేంద్రనగర్‌ నుంచి మెహిదీపట్నం వైపు బైక్‌పై వెళుతున్నాడు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెంబర్‌ 294 వద్ద ఆగాపురాకు చెందిన మహ్మద్‌ షాహిద్‌ అలియాస్‌ సైఫ్‌ అనే వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్‌ అయ్యిందని అర్జంట్‌గా వెళ్లాలని మోహిదీపట్నం వరకు లిఫ్ట్‌ అడిగి ఎక్కాడు.

మెహిదీపట్నం పిల్లర్‌ నెంబర్‌ 28 వద్దకు రాగానే పక్కనే ఉన్న గల్లీలో దించాలని కోరాడు. అప్పటికే అక్కడ ఉన్న షాహిద్‌ స్నేహితులు షేక్‌ అక్రమ్, మహ్మద్‌ నసీర్‌ ముగ్గురు కలిసి జయంత్‌ను భోజగుట్ట స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. కొట్టి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.40 వేలు లాక్కున్నారు. అతని ఫోన్‌ నంబర్‌ తీసుకుని బెదిరించి పలు దఫాలుగా గూగుల్‌ పే ద్వారా రూ.51 వేలు బదిలీ చేయించుకున్నారు.

ఈ నెల 13న బాధితుడు ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గురువారం నిందితులను అరెస్ట్‌ చేశారు. సమావేశంలో ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జీహెచ్‌.శ్రీనివాస్, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, ఎస్‌.ఐ. కె.శ్రీనివాసతేజ, క్రైమ్‌ సిబ్బంది టి.రవీంద్రనాథ్, బి.విద్యాసాగర్, జె.అచ్చిరెడ్డి, జి.రాహుల్, బి.సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.  

(చదవండి: చంపేసి శవాన్ని సొంతూరుకు సాగనంపి..)

Advertisement
Advertisement