కొడుకు అందివచ్చాడనుకుంటే.. ఇంతటి విషాదమా | 2 Young Men Deceased In Road Accident Yalamanchili | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజునే విషాదం.. అందివచ్చిన కొడుకు

Apr 23 2021 2:08 PM | Updated on Apr 23 2021 2:59 PM

2 Young Men Deceased In Road Accident Yalamanchili - Sakshi

యలమంచిలి రూరల్‌/అచ్యుతాపురం: పుట్టిన రోజే గిట్టిన రోజైంది.. మరో మిత్రుడినీ బలి తీసుకుంది. గాజువాక–యలమంచిలి బైపాస్‌ రోడ్డులో ఈ దారుణం జరిగింది. కట్టుపాలెం చెరకు కాటా వద్ద బుధవారం అర్ధరాత్రి నలుగురు మిత్రులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. యలమంచిలికి చెందిన కొఠారు రవితేజ (27), అచ్యుతాపురం మండలం ఎస్‌ఈజెడ్‌ కాలనీకి చెందిన నడిపింటి రాజు (26), రాజాన వంశీ (20), బండారు ప్రదీప్‌ (26) స్నేహితులు. ఎస్‌ఈజెడ్‌లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు.

ఈ కర్మంలో బుధవారం రవితేజ పుట్టిన రోజు కావడంతో వారంతా యలమంచిలి వెళ్లారు. అక్కడి నుంచి కారులో తిరిగి వస్తుండగా చెరకు కాటా వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా లారీ రావడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి పొలంలోకి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ, నడిపింటి రాజు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన వంశీ, ప్రదీప్‌ విశాఖలో డెయిరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యలమంచిలి టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు 
ఎదిగిన కొడుకులు కన్నుమూయడంతో రవితేజ, రాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రవితేజ తండ్రి సత్యనారాయణ వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు అందివచ్చాడనుకుంటే ఇలా జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో భార్య లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు కొడుకు కూడా మరణించడంతో ఆయనను అదుపు చేయడం ఎవరితరం కాలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన నడిపింటి రాజుకు తల్లిదండ్రులు నాగరాజు, సీత, అక్క ఉన్నారు. రాజు డిగ్రీ పూర్తి చేసి సన్వీరా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తానని చెప్పాడని, విగత జీవిగా చూడాల్సివస్తుందనుకోలేదని తల్లి సీత గుండెలవిసేలా ఏడుస్తోంది. 

చదవండి: ప్రేమపెళ్లి.. ఏం కష్టం వచ్చిందో ఏమో.. పాపం

Advertisement
 
Advertisement
Advertisement