చిత్తూరు కలెక్టరేట్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు, గుడిపాల మండలాల స్థాయి ‘చెకుముకి సైన్స్ సంబరాలు’ గురువారం తపోవనం ఉన్నత పాఠశాలలో విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రెండు మండలాల నుంచి 46 బృందాలుగా మొత్తం 138 మంది విద్యార్థులు పాల్గొని తమ వైజ్ఞానిక ప్రతిభను చాటుకున్నారు.
27న జిల్లా స్థాయి పోటీలు
ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు హెచ్.అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో 20 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా, గురువారం 28 మండలాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి చేశామన్నారు. విజేతలకు ఈ నెల 27న చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగర శాఖ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని రేకెత్తించే వినూత్న ప్రశ్నపత్రాలే చెకుముకి ప్రత్యేకతని తెలిపారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దండాల రాధాకృష్ణ సరస్వతి దంపతులు రూ.10 వేల విలువైన మెమెంటోలను, విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ త్యాగరాజు నాయుడు రూ.10 వేల విలువ చేసే బహుమతులను విజేతలకు అందించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షులు జయంతి, గౌరవ అధ్యక్షుడు మునిరత్నం, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, తపోవనం హెచ్ఎమ్ కుప్పస్వామి పిళ్లై, సభ్యులు అమరనాథ్ రెడ్డి, రాజశేఖర్, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
మండలాల వారీగా విజేతలు
చిత్తూరు అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏపీఆర్ఎస్ మైనారిటీ పాఠశాల ప్రథమ, జెడ్పీ హైస్కూల్ దొడ్డిపల్లె ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ విభాగంలో బృందావన్ ఇంగ్లిష్ మీడియం ప్రథమ, క్యాంఫర్డ్ నార్త్ పాఠశాల ద్వితీయ బహుమతులు సాధించాయి. చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని ప్రభుత్వ విభాగంలో బీఎన్ఆర్ పేట జెడ్పీ హైస్కూల్ ప్రథమ, తుమ్మింద జెడ్పీ హైస్కూల్ ద్వితీయ బహుమతి గెలుపొందగా, ప్రైవేటు విభాగంలో రెయిన్బో సీబీఎస్ఈ పాఠశాల ప్రథమ, రెయిన్బో ఇంగ్లిష్ మీడియం ద్వితీయ స్థానాలు కై వసం చేసుకున్నాయి. గుడిపాల మండలంలోని జెడ్పీ హైస్కూల్ నరహరిపేట నుంచి వచ్చిన రెండు జట్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి ప్రతిభను చాటాయి.


