కుప్పం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ టీడీపీ నేతలకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వైఎస్సార్సీపీ నిజాయితీగా ఎన్నికలకు వస్తుంటే టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చి ఉంటే చంద్రబాబుకు ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉండేది కాదని వెల్లడించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తదితర పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, మట్టి అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారని ఆరోపించారు.
భయపడే ప్రసక్తే లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భయపడే ప్రసక్తే లేదని, అన్ని వార్డులు, పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం వస్తారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారన్నారు. పెద్దిరెడ్డి అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని, ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు మొగసాల కృష్ణమూర్తి మాట్లాడుతూ పెద్దిరెడ్డిని అడ్డుకునే శక్తి టీడీపీకి లేదని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని తెలిపారు.


