చిత్తూరు అర్బన్: దివ్యాంగుల సమస్యలు పట్టించుకోకుండా.. వాళ్లపై దాడులకు కారణమైన ఐరాల ఎస్ఐను సస్పెండ్ చేయాలని వికలాంగుల జేఏసీ నేతలు చంద్రశేఖర్, సుమతి డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో నిర్వహించిన పోలీసు గ్రీవెన్సులో అధికారులకు రాత పూర్వక ఫిర్యాదు అందచేశారు. వారు మాట్లాడుతూ జూలై 8వ తేదీన దివ్యాంగురాలు విజయ ఇంటి స్థలం విషయంలో న్యా యం చేయాలని ఎస్ఐను కోరితే పట్టించుకోలేదన్నారు. పైగా తమపై దాడి చేయించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ నేతలు మురళి, బాలాజీ నాయుడు, భూపాల్ పాల్గొన్నారు.
సకాలంలో సమస్యల పరిష్కారం
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. సోమవారం నిర్వ హించిన డయల్ యువర్ ఎస్ఈలో ఆయన మాట్లాడారు. స్థానిక ముత్తిరేవులలో తమ ఇంటి పరిసరాల్లోనే అనుమతి లేకుండా ట్రాన్స్ఫార్మర్ పెట్టారని వినియోగదారుడు రాజాగోపాల్రెడ్డి ఫిర్యాదు చేశారు. నగరంలోని సంతపేటలో రామచంద్ర ఆశ్రమం వద్ద లూజ్లైన్ను బాగుచేయాలని స్థానికుడు జగదీష్ కోరారు. అలాగే పలమనేరులోని పలమాకులపల్లె రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా కరెంటు స్తంభం నాటినట్లు సుబ్రమణ్యంరెడ్డి ఫిర్యాదు చేశారు. అన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు.
గుర్తుతెలియని
వృద్ధుడి మృతదేహం
యాదమరి: మండలంలోని పెరుమాళ్లపల్లె సమీపంలోని ఆరు వరుసల జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం పడి ఉందని ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. సోమవారం ఈ మేరకు రాంప్రసాద్ అనే వ్యక్తి అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామన్నాఉ. మృతుడి వద్ద ఆధారాలు లేకపోవడంతో గ్రామంలో విచారించామని వెల్లడించారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిగా తెలిసిందని చెప్పారు. అనారోగ్య కారణాలతో మరణించి ఉంటాడని గుర్తించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఉరి వేసుకొని
యువకుడి ఆత్మహత్య
రేణిగుంట: మండలంలోని వెంకటాపురం సమీపంలోని ఇటుకుల తయారీ కేంద్రంలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తున్న కె.చిరంజీవి (24) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తవణంపల్లి మండలం, ముత్తరపల్లికు చెందిన చిరంజీవి వివాహ సమయంలో చేసిన రూ.4 లక్షల అప్పును తీర్చేందుకు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 9వ తేదీ రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా, చిరంజీవి నివాసముంటున్న రేకుల షెడ్డు పైకప్పులోని ఐరన్ రాడ్కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేనిగుంట పోలీసులు తెలిపారు.


