చిత్తూరు కలెక్టరేట్ : అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం సీఎంవో నుంచి అందిన ప్రజా ఫిర్యాదులపై ఆరా తీశారు. సీఎంవో నుంచి వచ్చిన నాలుగు అర్జీలపై అర్జీదారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులైన వి.కోట మండలం పెద్దపల్లెకు చెందిన జనార్ధన్ రెడ్డి, రొంపిచర్ల మండలానికి చెందిన ముప్పిరెడ్డి దీప నారాయణి, రామకుప్పం మండలం పండ్యాలమడుగుకు చెందిన మురుగేష్, రామకుప్పం మండలం వెర్నమల్ల గ్రామానికి చెందిన రాజప్పతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని పేర్కొన్నారు.


