గుడిపాల: ఉపాధిహామీ పథకంలో జరిగిన అవినీతిపై గుడిపాల ఎంపీడీవో శిరీషకు బుధవారం గట్రాళ్లమిట్ట గ్రామంలోని రైతులు ఫిర్యాదు చేశారు. ఈనెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ఉపాధిలో లక్షల్లో అవినీతి అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై రైతులు తాము సొంతంగా సాగు చేసుకున్న మామిడి, కొబ్బరి మొక్కలకు బిల్లులు పెట్టుకోలేదని, తమ పేరుతో బిల్లులు చేసుకున్నారని తెలిపారు. పూర్తిస్ధాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సు కండక్టర్గా ఉద్యోగం చేస్తున్న గోపీనాథ్, ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న శ్రీలత, భానుప్రియకు ఉపాధి హామీ జాబ్కార్డులు ఉన్నాయని, వారి పేరు మీద పనులు చేయకుండానే రూ.లక్షల్లో నగదు జమ అయినట్టు పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో శిరీష మాట్లాడుతూ ఉపాధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. గోపీనాథ్ ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసిందని, అతను ఉద్యోగంలో ఎప్పుడు చేరారో వివరాలు ఇవ్వాలని చిత్తూరు ఆర్టీసీ ఆర్ఎంను కోరామని తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత రికవరికీ ఆదేశిస్తామన్నారు. అలాగే ఏఎన్ఎంలపైనా విచారిస్తున్నామన్నారు. ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని ఆమె తెలియజేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం
ఎంపీడీవో కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో బుధవారం ఎంపీడీవో సమావేశం నిర్వహించారు. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి జాబ్కార్డులు ఎలా ఇచ్చారని ఆరా తీశారు. జాబ్కార్డులు వెరిఫికేషన్ చేయాలని, ఉద్యోగులకు కార్డులు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఫీల్ట్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్టు వివరించారు.


