బంగారుపాళెం: మండలంలోని తిమ్మోజుపల్లె సమీపంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిమ్మోజుపల్లె సమీపంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న బాడా హోటల్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాడుతుండగా పలమనేరు నుంచి చిత్తూరు వైపు పోతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదని, చిరునామా కోసం విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
బంగారుపాళెం : మండలంలోని సదకుప్పంలో కుటుంబ కలహాల కారణంగా వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సదకుప్పానికి చెందిన మునస్వామి(65), భార్య మొగిలమ్మ ఓ మామిడి తోటలో కాపలా ఉంటున్నారు. వారు మంగళవారం రాత్రి గొడవ పడ్డారు. దీంతో మునస్వామి అతిగా మద్యం సేవించి మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, భార్య మొగిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పంటలపై ఏనుగుల దాడులు
గుడిపాల: మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ వరిపంట, అరటి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి పాపసముద్రం, పిళ్లారికుప్పం ప్రాంతంలో ఏనుగులు గుమ్మడి, అరటి, వరి పంటలను పూర్తిస్ధాయిలో ధ్వంసం చేశాయి. పైపులు, రాతికూసాలను విరిచేశాయి. అప్పులుచేసి పంటలను సాగుచేస్తే ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు టపాకాయలు పేల్చుకుంటూ చేతులు దుడుపుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


