చిత్తూరు అర్బన్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆయన బుధవారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇండియన్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కానిస్టేబుల్ బి.ప్రవీణ్ కుమార్ సతీమణి లావణ్యకు రూ.లక్ష, విజయవాడలో అల్లరి మూకల దాడిలో గాయపడిన చిత్తూరు ఎస్టీఎఫ్ ఏఆర్పీసీ టి.చిన్నతంబికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.20 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్.షాను, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటికి వెళ్తుండగా అనంత లోకాలకు..
పూతలపట్టు(యాదమరి): రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాల్లో ప్రతి రోజూ లాగే పని ముగిసింది. అలసిపోయిన శరీరంతో.. ఇంటి దగ్గర ఎదురుచూసే తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరాలన్న ఆతృతతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. విధి చిన్నచూపు చూడడంతో ఆ ప్రయాణమే వారికి చివరి మజిలీ అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన నాగరాజు(40) కొద్ది నెలలుగా రంగంపేట క్రాస్లో నివాసం ఉంటూ తాపీ మేసీ్త్రగా పని చేస్తున్నాడు. అతనితో పాటు పూతలపట్టుకు చెందిన రాంబాబు(35) కూడా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా గాండ్లపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని రాంబాబును 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతను మృతిచెందాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొనిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


