తిరుపతి మంగళం : తిరుపతి జిల్లాలో చెరుకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరు కు పరిశ్రమ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన మంగళవారం లోక్సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారీగా చెరుకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి వివరా లను కేంద్రం సభకు సమర్పించిందని, తిరుపతి జిల్లాలో చెరుకు సాగు, ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ఠాకూర్ పేర్కొన్నారు. సహకార చక్కెర కర్మాగారాల ఆధునికీకరణ, పునరుద్ధరణ కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా 2023–24, 2024–25 సంవత్సరాల్లో రూ.10,005 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. తిరు పతి జిల్లాలో చెరుకు సాగు క్షీణత ఆందోళన కలిగించే అంశమని, కేంద్రం వెల్లడించిన పథకాల ప్రయోజనాలు జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.


