చిత్తూరు కలెక్టరేట్ : మానవ అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి భారతి పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన, అప్రమత్తత పెంచుకోవాలన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా లైంగిక దోపిడీ, వెట్టిచాకిరి, బలవంతపు వివాహాలు, అవయవాల అక్రమ విక్రయాలు వంటి దారుణాలు కొనసాగడం ఆందోళనకరమని తెలిపారు. ఉద్యోగాల పేరుతో, సోషల్ మీడియాలో వల విసిరి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో విద్యార్థులు 1098 చైల్డ్ హెల్ప్లైన్ వినియోగించుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని, అపరిచితులను నమ్మవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు మానవ అక్రమ రవాణా నిరోధక పోస్టర్ను ఆవిష్కరించారు.గాంధీ విగ్ర హం నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఉషరాణి, రోప్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ధనశేఖరన్, జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ నిర్మల పాల్గొన్నారు.


