పలమనేరు : రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కక్ష సాధింపులకే పురపాలక అధికారుల ద్వారా నోటీసు జారీ చేశారని పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నేరుగా ఏమీ చేయలేక మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని వేధింపులకు దిగుతోందని ఆరోపించార. నిబంధనల మేరకు ఉన్న భవనానికి విరుద్ధంగా ఉందంటూ నోటీసు జారీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నోటీసులు న్యాయపరంగానే సమాధానమిస్తామని, పట్టణంలో నిబంధనలు పాటించని వారి వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకుని కమిషనర్కు సైతం నోటీసు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు.
వివరం ఇదీ..
పలమనేరు బసవన్న కట్టవీధిలో హేమంత్కుమార్ రెడ్డికి డోర్ నంబర్ 12–6లో ఓ భవనం ఉంది. దీనికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని మున్సిపల్ అధికారులు నోటీసు పంపించారు. ప్లాన్ మేరకు గ్రౌండ్లో లేదని, రెసిడెంట్గా కాకుండా కమర్షియల్గా ఉందని, పార్కింగ్ లేదని, బిల్డప్ ఏరియాలోనూ డీవియేషన్ ఉందంటూ ఏపీఎం చట్టం 1965 మేరకు టౌన్ప్లానింగ్ వారు నోటీసు జారీ చేశారు.
కుట్రపూరితంగానే..
పట్టణంలో టౌన్ప్లానింగ్ నిబందనలు పాటించని కట్టడాలు సుమారు 50శాతం వరకు ఉన్నాయి. వీరి దగ్గర ఎంత నగదు తీసుకుని టౌన్ప్లానింగ్ అధికారులు అనుమతులు జారీ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం హేమంత్కుమార్రెడ్డిని వేధించేందుకే నిబంధన ప్రకారం ఉన్నప్పటికీ సదరు భవనానికి నోటీసులు జారీ చేశారు. టీడీపీ నేతల ఆదేశాల మేరకు నోటీసు ఇచ్చినందుకు అధికారులే కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హేమంత్కుమార్రెడ్డి హెచ్చరించారు.


