చిత్తూరు కలెక్టరేట్ : ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘోష్ అక్రమ అరెస్ట్కు యత్నించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి వాడ గంగరాజు మండిపడ్డారు. బుధవారం చిత్తూరు కొంగారెడ్డిపల్లె లో ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్న్లోకి పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవేశించడం దుర్మార్గమన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మసూద్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం ప్రైవేటు వాహనంలో, యూనిఫామ్ ధరించకుండా వచ్చి జాతీయ నాయకురాలిని ఢిల్లీలోని కార్యాలయంలో అరెస్టు చేసేందుకు యత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. బెదిరింపు చర్యలతో ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు.


