భారీగా పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలు
బస్తాపై రూ.వెయ్యి మేర అధికంగా అమ్మకాలు
అదే బాటలో మల్చింగ్ షీట్ల విక్రయాలు
యుద్ధం సాకు చూపుతున్న వ్యాపారులు
భారీగా కాంప్లెక్స్, డీఏపీ, డ్రిప్ ఎరువుల రేట్లు
పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు
పలమనేరు : యుద్దం ముగిసినా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే బాటలో చాలా మంది వ్యాపారులు ఎరువులు,డీఏపీలు, డ్రిప్ ఎరువుల రేట్లను భారీగా పెంచేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా.. నిర్వాహకులు మాత్రం ఇస్టానుసారంగా ధరలను పెంచి రైతులను నిలువునా దోచుకుంటున్నారు.
ఇవేం ధరలు బాబోయ్!
జిల్లాలోని పడమటి ప్రాంతంలో ఎక్కువగా హార్టికల్చర్ పంటలను రైతులు సాగుచేస్తుంటారు. హైబ్రిడ్ వంగడాలైనా వీటికి కచ్చితంగా నూతన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఆమేరకు ఏ పంట సాగుకై నా చీడపీడల నివారణ కోసం మల్చింగ్ షీట్లను వాడాల్సిందే. మొన్నటి దాకా మల్చింగ్ షీట్ 20 ఎంఎం ధర 400 మీటర్ల రోల్ రూ.1800 ఉంటే, అధి ఇప్పుడు రూ.26,00 అయ్యింది. 600 మీటర్ల రోల్ గతంలో రూ.2,200 ఉండగా దాని ధర ప్రస్తుతం రూ.2,900 అయ్యింది. 800 మీటర్ల రోల్ గతంలో రూ.2,400 ఉండగా ఇప్పుడు రూ.3,600 విక్రయిస్తున్నారు. 25 ఎంఎం ధరలు గతంలో 400 మీటర్లు రూ.2,200 ఇప్పుడు 2,900.,600 మీటర్లు రూ.2600 ఇప్పుడు రూ.3,200, 800 మీటర్లు రూ.3,400 ఇప్పుడు రూ.4,800 గా ఉండగా అన్నింటిపై రూ.వెయ్యి పెంచేశారు. ఇక 30 ఎంఎం రోళ్లపై కేజీ రూ.175 ఉండగా ప్రస్తుతం రూ.200, గతంలో డ్రిప్పులకు సంబంధించిన డ్రిప్ లేటర్ల 1000 మీటర్లు ధర రూ.1200 గా ఉండగా వీటి ధర ఇప్పుడు రూ.1,700గా ఉంది. పంటలకు అవసరమైన డ్రిప్పు ఎరువులు గతంలో 19–19–19 ధర రూ.2,200 ఉండగా, ఇప్పుడు రూ.3,200 పలుకుతోంది. 20– 20– 20 ధర గతంలో రూ.2,100 కాగా, ఇప్పుడు రూ.3,100 అయ్యింది. 1261 ఎరువు ధర గతంలో రూ.3,600 కాగా ప్రస్తుతం రూ.4,800 దాటింది. ఆఖరుకు మొన్నటిదాకా కిలో రూ.150 గా ఉన్న ట్వైన్ ఇప్పుడు రూ.240 వరకు పెరిగిపోయింది.
భారీగా పెంచిన రిటైలర్లు
వాస్తవం ఇదీ..
ప్రస్తుతం కాంప్లెక్స్ 20– 20– 13 ధర రూ.2,200 ఉంది, 15,15,15 ధర రూ.2,100గ ఉంది.10.26.26 ధర రూ.2,100 ఉంది. 14.30.14 ధర రూ.2080గా ఉంది. అదే యూరియా ప్రభుత్వ ధర రూ.270 ఉండగా ట్రాన్స్ఫోర్ట్ చార్జీలను పెంచి బ్లాక్ మార్కెట్లో రూ. 350గా అమ్ముతున్నారు. ఇక డీఏపీ బస్తా ధర రూ.1475 ప్రభుత్వ ధర ఉండగా రూ.1,800 లెక్కన అమ్ముతున్నారు.పలమనేరు వ్యవసాయశాఖ పరిధిలో 580 దాకా ఫర్టిౖలైజర్స్ దుకాణాలున్నాయి. వీటిల్లో ఎరువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి విక్రయిస్తున్నారు.
వ్యవసాయం అంటే దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. పెట్టుబడి సైతం గిట్టుబాటు కాని దుస్థితి దాపురించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రేటు దక్కక అన్నదాత కుంగిపోతున్నాడు. ప్రభుత్వం సైతం చేయూతనందించకపోవడంతో మరింత దిగాలుపడుతున్నాడు. ఎరువులు.. పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాడు. రైతు ఇక్కట్లను పరిగణనలోకి తీసుకోని వ్యాపారులు మాత్రం యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. డీఏపీలు.. డ్రిప్ ఎరువులను యథేచ్ఛగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన వారికి యుద్ధం సాకును చూపిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు సేద్యం అంటేనే రైతులు భయపడే స్థాయికి తీసుకువచ్చేస్తున్నారు.
మల్టీబ్రాండ్ కంపెనీలైన జెనిగో, సొనైట్, గ్రీన్ఫ్రో, అగ్రిబ్రాండ్, ఐరిస్ లాంటి కంపెనీలు మల్చింగ్ షీట్లు కిలోపై రూ.200 దాకా పెంచారు. ఇదే అదునుగా భావించిన స్థానిక రీటైల్ దుకాణదారులు మరో రూ.500 పెంచేస్తున్నారు. ఈ క్రమంలో ఎరువులైనా, పురుగుమందులైనా, మల్చింగ్ షీట్లు అయినా, ప్రతి ఐటం మీద రూ.1000 అధికంగా వసూలు చేస్తున్నారు. అసలే పండించిన పంటలకు ధరల లేక, పెట్టిన పెట్టుబడి దక్కడ కుదేలైన రైతులు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నారు.


