పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ బుధవారం భూ పరిశీలన చేపట్టారు. జేసీ మాట్లాడుతూ ఆర్ఓబీ పనులకు రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. నగరి నుంచి దిండి వరకు చేపడుతున్న రైల్వే లైన్ భాగంగా తమిళనాడు సరిహద్దులోని తొట్టికండ్రిగ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తమిళనాడు భూములకు అధిక శాతం పరిహారం ఇస్తున్నారని, ఆ మేరకే తమ భూములకు కూడా పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని జేసీ హామీ ఇచ్చారు. తహసీల్దార్ గుర్రప్ప పాల్గొన్నారు.


