శాంతిపురం : టెంపో ఢీకొని మృతి చెందిన వారికి బంధు మిత్రులు అశ్రునయనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం కడపల్లె వద్ద దూసుకొచ్చిన టెంపో ముగ్గురి ప్రాణాలు తీసి, ఐదుగురిని ఆస్పత్రి పాలు చేయడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతి చెందిన బీరనకుప్పం గ్రామానికి చెందిన టీడీపీ నేత సుందరప్ప, అదే గ్రామానికి చెందిన మునివెంకటమ్మకు పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామంలో అంత్య క్రియ లు నిర్వహించారు. వారి సొంత భూముల్లోనే వారిని ఖననం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరితో మంచిగా ఉండే సుందరప్ప రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందడంతో పెద్ద సంఖ్యలో జనం కడసారి చూపులకు తరలివచ్చి నివాళులర్పించారు. తీవ్రంగా గాయపడి కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న నందిని, లక్ష్మి, కనగవళ్లి, సతీష్, పూంగోడి, అక్షయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. మరో వైపు ఇదే ప్రమాదంలో మృతి చెందిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మహేష్, దీప కుమారుడు సాత్విక్(6) మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కడపల్లెకు వచ్చిన దంపతులు ప్రమాదంలో ముక్కపచ్చలారని తమ కుమారుడిని కోల్పోయారు.


