చిత్తూరు కార్పొరేషన్: అందరి జీవితాల్లో ఆనందం నిండాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆకాంక్షించారు. గురువారం కలెక్టరేట్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, వేద విజ్ఞానం సంప్రదాయాల్ని వారసత్వంగా కొనసాగించాలన్నారు. ఉగాదిని పండుగకే పరిమితం చేయకుండా ఇందులోని విశిష్టతను తెలుసుకోవాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్ మాట్లాడుతూ ఉగాది యుగానికి ఆది అని అభివర్ణించారు. అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అర్చకులు చిలకమర్తి వెంకటసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరంలో అన్నింటా జిల్లా ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు. వేద పండితులు వెంకటసుబ్బారావు, శ్రీధర్అయ్యర్, పద్మనాభగురుకుల్, రామకృష్ణఆచార్య, పార్థసారథిని ప్రభుత్వం తరఫున సత్కరించి గౌరవించారు. ఉగాది కవి సమ్మేళనంలో కవితలను ఆలపించిన కవులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. అలాగే పండ్ల పరిశ్రమ, మామిడి రైతులకు చేసిన సేవలను గుర్తించి ఆలిండియా ఫుడ్ ప్రొసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ బాబిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్రకుమార్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చిట్టెమ్మ, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బాబిని సన్మానిస్తున్న ఇన్చార్జ్ కలెక్టర్, అధికారులు
మాట్లాడుతున్న ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్


