చిత్తూరు కలెక్టరేట్ : పదో తర గతి హాల్టికెట్లలో పరీక్ష కేంద్రాల చిరునామా గందరగోళంపై సాక్షి దినపత్రికలో ఈ నెల 6వ తేదీన ‘పదిలం ప్రశ్నార్థకం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై విద్యాశాఖలో కదలిక వచ్చింది. తక్షణమే తప్పు ను సరిదిద్ది విద్యార్థులకు న్యాయం చేశారు. హాల్టికెట్లలో ఉన్న పాత అడ్రెస్ (కొంగారెడ్డిపల్లి) వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. యుద్ధప్రాతిపదికన ఆన్లైన్ డేటాలో మార్పులు చేపట్టారు. ప్రస్తుతం పాఠశాల నిర్వహిస్తున్న రామ్నగర్ కాలనీ చిరునామాతో కొత్త హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు సాక్షికి ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.
పోలీసుశాఖలో 250 మంది బదిలీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసుశాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. ఒకే స్టేషన్లో మూడేళ్లుగా పనిచేస్తున్న వాళ్ల నుంచి ఐదేళ్ల పాటు ఒకే స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 125 మంది కానిస్టేబుళ్లు, 60 మందికి పైగా హెడ్కానిస్టేబుళ్లు, 50 మంది వరకు ఏఎస్ఐలు ఉన్నారు. కొందరు రెండేళ్ల పాటు ఒకే స్టేషన్లో ఉన్నా.. అనారోగ్య కారణాలు, భార్య–భర్త వేర్వేరు స్టేషన్లలో ఉన్న వాళ్లు సైతం కౌన్సెలింగ్కు హాజరయ్యారు. పలువురిని మానవతాదృక్పథ కారణాలరీత్యా కోరుకున్న స్టేషన్లకు బదిలీ చేశారు. మొత్తంగా గతేడాది పుంగనూరులో జరిగిన ఓ హత్య కేసు కారణంగా.. వందలాది మంది సిబ్బందికి ఎలాంటి కౌన్సెలింగ్ నిర్వహించకుండా, ఏకపక్షంగా జరిగిన బదిలీలపై సిబ్బంది దుమ్మెత్తిపోశారు. తాజాగా కౌన్సెలింగ్ నిర్వహించి.. పోస్టింగులు ఇవ్వడంపై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు.


