గడువులోపు అర్జీలకు పరిష్కారం చూపాలి
కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి
క్షుణ్ణంగా పరిశీలించి కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలి
జిల్లా స్థాయి రెవెన్యూ సమావేశంలో కలెక్టర్ కీలక ఆదేశాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో భూసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి రెవెన్యూ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను నిర్దేశిత గడువులోపు (ఎస్ఎల్ఏ) ఎటువంటి తప్పులు లేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన మ్యుటేషన్లు, సర్వే, పాస్ పుస్తకాలు, సర్వే నంబర్ సబ్ డివిజన్ వంటి అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. జిల్లాలో రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డుల నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 276 ఆర్ఓఆర్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వివిధ కోర్టుల్లో ఉన్న భూ వివాదాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సకాలంలో కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఏ.రాజేంద్రన్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని గుర్తుచేశారు. నిబంధనల మేరకు మ్యుటేషన్లు, 22ఏ నిషేధిత భూముల అంశాలను క్లియర్ చేయాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్ కుమార్, సర్వే శాఖ డీడీ జయరాజ్, జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


