వెదురుకుప్పం: సంపద సృష్టించి వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచుతానని చెప్పిన చంద్రబాబునాయుడు పేదల కడుపుకొట్టడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి మండిపడ్డారు. ఆయన బుధవారం వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం కోసం వైఎస్.జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అమలు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని గుర్తు చేశారు. దేశ చరిత్రలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అయినప్పటికీ నేను అదిచేశాను.. ఇది చేశాను అని చెప్పు కోలేదని వెల్లడించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అలివికాని హామీలతో గద్దెనెక్కి అన్నీ తానే చేశానని పేదలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డీసీ కింద తీసుకున్న రుణాల రికవరీలో లబ్ధిదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పా రు. రుణాలు చెల్లించకపోతే కేసులు పెడతా మని వేధిస్తున్నట్టు తెలిపారు. పేదల కడుపుకొట్టే ప్రభుత్వాల మనుగడ అసాధ్యమన్నారు. పేదల కోసం వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల తీసుకొచ్చినట్లు తెలిపారు. అప్పట్లో పచ్చికాప్లంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి పూర్తి స్థాయిలో ప్యాకల్టీని సమకూర్చినట్లు చెప్పారు. వెదురుకుప్పంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆగిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా వాటి గురించి పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలు ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు.


