పుత్తూరు: పట్టణంలోని పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్వీ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ సివిల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయని తెలిపారు. 2026లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు సైతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 4వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది పుత్తూరు, నగరిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో తేజశ్రీ ప్రతిభ
వెదురుకుప్పం: జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో వెదురుకుప్పం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని తేజశ్రీ ప్రతిభను కనబరిచింటది. హెచ్ఎం శివశంకరయ్య బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 1, 2, 3వ తేదీల్లో గోవాలో జరిగిన సౌత్జోన్ సీనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో టెన్త్ విద్యార్థిని తేజశ్రీ పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు చెప్పారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన పీడీ రమేష్, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు.
అవినీతి కంపుపై విచారణ..?
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరుతున్న అవినీతిపై సీఎంఓ కార్యాలయం నుంచి విచారణ చేపట్టినట్టు అధికారవర్గాలు తెలిపాయి. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ఆరోగ్య శాఖలో అవినీతి కంపుపై సీఎంఓ కార్యాలయం స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశిస్తూ డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయానికి మెయిల్ చేసినట్లు తెలిసింది. ఆ కథనంపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీన్ని శాఖలోని కొందరు అధికారులు తోసిపుచ్చునట్లు తెలిసింది.
పరీక్షకు భయపడి
విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు అర్బన్ : పదో తరగతి పరీక్షలు దగ్గరవుతున్న నేపథ్యంలో రజియా (14) అనే విద్యా ర్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు టు టౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. చిత్తూరులోని రాంనగర్ టెలిఫోన్ కాలనీకి చెందిన రజియా కన్నన్ ప్రభుత్వ కళాశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె పరీక్షలు అంటే తరచూ భయపడేది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటో ఫ్యానుకు ఉరి వేసుకొని మృతి చెందింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


