శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రేపటి నుంచి
ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
తిరుపతి సిటీ: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ అధ్యయన కేంద్రం రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్టికెట్లు అందించామని తెలిపారు. నిర్ణీత గడవుకు 30 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. డిగ్రీ థర్డ్ ఇయర్ 5వ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు, సెకండియర్ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు, ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ, యూజీ, పలు డిప్లొమా కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోపు ఇగ్నో వెబ్సైట్ నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


