
ఆశగా వచ్చారు.. నిరాశతో వెళ్లారు!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కరించుకుందామని ఆశతో వచ్చా రు. అయితే కలెక్టరేట్లో కార్యక్రమం రద్దు కావడంతో ఏమీ చేయలేక నిరాశతో వెనుదిరిగారు. జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారులు సమస్యల పరిష్కార కోసం సోమవారం కలెక్టరేట్కు విచ్చేశారు. కాగా, కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసి పలమనేరులో నిర్వహించిన విషయం విదితమే. దీంతో మధ్యాహ్నం వరకు పలువురు అర్జీదారులు కలెక్టరేట్లో నిరీక్షించి చేసేదేమి లేక నిరాశగా ఇళ్లకు వెనుదిరిగారు.
ఎంఎల్హెచ్పీల సమస్యలు పరిష్కరించాలి
కూటమి టీడీపీ ప్రభుత్వం ఎంఎల్హెచ్పీ (మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోషియేషన్) జిల్లా అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం నిమిత్తం ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరవదిక సమ్మె నిర్వహించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సమ్మెలో ఆ సంఘ నాయకులు మమత, రాజేష్, గణేష్, శ్రీవాణి, అనిత తదితరులు పాల్గొన్నారు.
పొలానికి దారి లేకుండా చేస్తున్నారు
తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని గంగాధరనెల్లూరు మండలం ముకల్తూరు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రాజమాణిక్యం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 478/28 లో ఐదు ఎకరాల భూమి ఉందన్నారు. తాను సైనికుడిగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటి నుంచి ఆ భూమిలోనే పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తన సమస్యను గంగాధరనెల్లూరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా వీఆర్వో, ఎంఆర్ఐ వచ్చి సమస్యను పరిశీలించారన్నారు. అయినప్పటికీ తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశగా వచ్చారు.. నిరాశతో వెళ్లారు!