
ఇంత కక్కుర్తా.. హుస్సేన్
● చర్చనీయాంశంగా తహసీల్దార్ ఏసీబీ కేసు
చిత్తూరు కలెక్టరేట్ : రైతు నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి రూ.75 వేలు లంచం తీసుకుంటూ సదుం మండల ఇన్చార్జి తహసీల్దార్ మారుఫ్ హుస్సేన్ ఏసీబీ వలలో చిక్కిన విషయం విధితమే. ఆయన అయిదుగురు కలెక్టర్ల వద్ద సీసీగా విధులు నిర్వహించారు. 2018లో అప్పటి కలెక్టర్, ప్రస్తుతం సీఎం సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, నారాయణ భరత్గుప్తా, హరినారాయణన్, షణ్మోహన్, ప్రస్తుత కలెక్టర్ సుమిత్ కుమార్ వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్) గా ఏడున్నర సంవత్సరం పాటు విధులు నిర్వర్తించారు. ఆయనకు జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులతో పాటు, సెకండ్ కేడర్ అధికారులంతా సుపరిచితమే. అంతేకాకుండా జిల్లా స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్లోనూ పలుకుబడి పెట్టుకున్నారు. ఆరుగురు కలెక్టర్ల వద్ద క్యాంప్ క్లర్క్ గా విధులు నిర్వర్తించిన హుస్సేన్ లంచానికి కక్కుర్తి పడి ఏసీబీకి దొరకడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో చర్చనీయాంశంగా మారింది.
రెవెన్యూ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులుగా..
ఏసీబీకి చిక్కిన సదుం ఇంచార్జి తహసీల్దార్ హుస్సేన్ జిల్లా రెవెన్యూ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయన లంచానికి కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కడం రెవెన్యూశాఖతో పాటు ఆ సంఘానికి మాయనిమచ్చని తీసుకొచ్చింది. కలెక్టరేట్లో ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సదుం ఇన్చార్జి తహసీల్దార్ ఏసీబీకి చిక్కడంతో అధికారులు కలెక్టరేట్కు నివేదికలు పంపిన వెంటనే ఆయనను సస్పెండ్ చేసి మరొకరిని ఇన్చార్జి తహసీల్దార్ గా నియమించనున్నారు.