
పల్లెల పరిశుభ్రతలో భాగస్వాములుకావాలి
బంగారుపాళెం : గ్రామాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములైనప్పుడే స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు అడుగులు సాధ్యమని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బంగారుపాళెం మేజరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తొలుత పాలేరు సమీపంలోని డంపింగ్ యార్డును సందర్శించి మొక్కను నాటి నీరు పోశారు. గ్రీన్ అంబాసిడర్లతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ అంబాసిడర్లకు పంచాయతీ కార్యదర్శులతో చర్చించి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. నెలకు ఒక్కసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు శుద్ధజలం అందించాలని ఆదేశించారు. కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత పడాలని హెచ్చరించారు. హైప్లజర్ క్లీనింగ్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసే విధానం గురించి డీపీఆర్సీ కో ఆర్డినేటర్ షణ్ముగం కలెక్టర్కు వివరించారు. వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద నూతనంగా నిర్మించిన నీటి తొట్టెలను, ఈ– వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శిరీషను ఆదేశించారు. చివరగా స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, తహశీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీధర్, స్థానిక సర్పంచ్ ఉమాదేవి, ఉప సర్పంచ్ కామరాజు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.