
● తాగి రోడ్డెక్కితే బాదుడే! ● డ్రంక్ అండ్ డ్రైవ్లో ర
చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు చూపించిన చుక్కల విలువ ప్రస్తుతం రూ.కోటి దాటింది. అవును.. డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు న్యాయస్థానం విధించిన జరిమానా రూ.కోటి దాటడం ఓ సరికొత్త రికార్డును సృష్టించింది.
సిఫార్సులు పట్టించుకోకుండా
చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు కొన్నాళ్లుగా ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నారు. తాగి రోడ్డుపైన వాహనం నడపకూడదు. పట్టుబడిన వ్యక్తి తమవాడేనని ఎవరు చెప్పినా వినకూడదని గట్టిగా అనుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని రోడ్డుపైనే ఏడాదిన్నరగా అమలు చేశారు. మద్యం తాగి స్కూటర్ నడపడం, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఇలా ఏ వాహనం నడిపినా మందుబాబులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా చెక్ చేయడం.. తాగినట్లు తేలితే వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేయడం చేస్తున్నారు. ఆపై వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. ఇలా ఏడాదిన్నర కాలంలో ఏకంగా 1540 మందిపై చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వీళ్లను న్యాయస్థానంలో హాజరు పరచగా.. తొలుత రూ.2 వేలు ఉన్న జరిమానా ఇటీవల మోటారు వాహన యాక్టును సవరణ చేయడంతో రూ.10 వేలకు చేరింది. ఫలితంగా మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడ్డ వాళ్లకు ఒక్కొక్కరికీ న్యాయస్థానం రూ.10 వేలు చొప్పున జరిమానాలు విధిస్తూ వస్తోంది.
తాగి బండి నడిపిన వారి తాట తీస్తున్నారు జిల్లా పోలీసులు.. ఇలా పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిన్నర కాలంలో జరిమానాలు ఏకంగా రూ. కోటి దాటాయంటే ఎంత విచ్ఛలవిడిగా తిరుగుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం జరిమానాలు రెట్టింపు చేసినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు వస్తేగానీ వీటిని కట్టడి చేయడం అంత సులువు కాదు.
జైలు శిక్షలు కూడా..
ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహన చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి కోర్టు రూ.10 వేల జరిమానా విధిస్తోంది. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా.. మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చిత్తూరులో ఇప్పటి వరకు 1540 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రుజువు కావడం ఏకంగా రూ.1,03,62,000 జరిమానాలు విధించారు. వీళ్లల్లో 32 మందికి ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు జైలు శిక్షలు కూడా విధించారు. జరిమానాలు, జైలుశిక్షల విషయం పక్కన పెడితే.. రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధానం కారణం. వాహన చోదకుల్లో మార్పు వస్తే తప్ప ఈ తరహా కేసుల నమోదుకు విరామం లభించదు.
మార్పు కోసమే..
మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లను కోర్టు ముందు ఉంచాలని, జరిమానా విధించాలని, జైలుకు పంపించాలన్నది మా లక్ష్యం కాదు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ విషయంలో గట్టిగా పనిచేస్తున్నాం. రోజుకు సగటున ఆరు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం. పట్టుబడుతున్న వారిలో 22–45 ఏళ్ల మధ్య వాళ్లే ఉక్కువగా ఉంటున్నారు. కొన్నిసార్లు మైనర్లు పట్టుబడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించాలి. – నిత్యబాబు, సీఐ, చిత్తూరు ట్రాఫిక్

● తాగి రోడ్డెక్కితే బాదుడే! ● డ్రంక్ అండ్ డ్రైవ్లో ర

● తాగి రోడ్డెక్కితే బాదుడే! ● డ్రంక్ అండ్ డ్రైవ్లో ర

● తాగి రోడ్డెక్కితే బాదుడే! ● డ్రంక్ అండ్ డ్రైవ్లో ర