Know Reasons Behind Why MNCs Are Quitting India, Know Details - Sakshi
Sakshi News home page

MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే!

Dec 27 2022 1:19 PM | Updated on Dec 28 2022 2:17 PM

Why Mncs Are Quitting India - Sakshi

ముంబై: భారీ వ్యాపారాల ఆశలతో భారత మార్కెట్లో ప్రవేశించిన పలు బహుళ జాతి దిగ్గజాలు (ఎంఎన్‌సీ) .. తమ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిస్థితులు కనిపించక పోతుండటంతో ఆలోచనలో పడుతున్నాయి. నిష్క్రమించడమో లేక వ్యాపారాల పరిమాణాన్ని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నిష్క్రమించిన హోల్సిమ్, ఫోర్డ్, కెయిర్న్, దైచీ శాంక్యో వంటి సంస్థల బాటలోనే తాజాగా జర్మనీ హోల్‌సేల్‌ దిగ్గజం మెట్రో కూడా చేరింది.

స్థానికంగా తీవ్ర పోటీ నెలకొనడం, అంతర్జాతీయంగా మార్కెట్‌ ప్రాధాన్యతలు .. వ్యాపార విధానాలు మారిపోతుండటం, పన్నులపరమైన వివాదాల్లో ఏకపక్ష నిర్ణయాలు, పెరిగిపోతున్న నష్టాలు మొదలైనవి ఎంఎన్‌సీల నిష్క్రమణకు కారణాలుగా ఉంటున్నాయని పరి శ్రమ వర్గాలు తెలిపాయి. ఎనిమిదేళ్ల క్రితం ఫ్రాన్స్‌కి చెందిన క్యారీఫోర్‌ .. భారత్‌లో తమ హోల్‌సేల్‌ వ్యాపారాన్ని మూసేసింది. 19 ఏళ్ల కింద భారీ అంచనాలతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మెట్రో ప్రస్తుతం తమ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ వ్యాపారంలో మార్జిన్లు అత్యంత తక్కువగా ఉండటమే క్యారీఫోర్‌ వంటి ఎంఎన్‌సీలు నిష్క్రమిస్తుండటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా రిటైల్‌ రంగంలో రిలయన్స్‌ వంటి బడా కంపెనీలకు అనుకూలంగా కన్సాలిడేషన్‌ చోటు చేసుకుంటోందని వారు తెలిపారు. కిరాణా దుకాణాలకు కూడా క్విక్‌ కామర్స్, ఈ–కామర్స్‌ వంటి విభాగాల నుంచి పోటీ తీవ్రమవుతోందని వివరించారు.  

దేశీ సంస్థల హవా.. 
దేశీ సంస్థల హవా పెరుగుతుండటంతో ఎంఎన్‌సీల వాటా తగ్గుతూ వివిధ రంగాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉదాహరణకు సిమెటు రంగాన్ని తీసుకుంటే స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌ తమ భారత సిమెంటు యూనిట్లను అదానీ గ్రూప్‌నకు విక్రయించాక ఈ రంగంలో టాప్‌ కంపెనీలుగా దేశీ సంస్థలే ఉండటం గమనార్హం. పర్యావరణ అను­కూల వ్యాపారాలపై దృష్టి పెట్టేందుకే భారత్‌లో వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు హోల్సిమ్‌ పేర్కొంది. ఇలా ఆయా ఎంఎన్‌సీల వ్యాపార కారణాల వల్లే అవి నిష్క్రమిస్తున్నాయే తప్ప నియంత్రణ సంస్థలు, చట్టాలపరమైన అంశాల వల్ల కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అలాగే అంతర్జాతీయంగా మాతృ సంస్థ పాటించే విధానాలకు అనుగుణంగా ఇక్కడి వ్యాపార నిర్వహణ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఎంఎన్‌సీలు తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మార్జిన్లు అంతగా లేకపోవడానికి తోడు భౌతిక స్టోర్స్‌ ద్వారా నిర్వహించే వ్యాపారాలకు ఆన్‌లైన్‌ మాధ్యమాల నుంచి పోటీ పెరగడం సైతం ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాయి.

దీనికి క్యారీఫోర్‌ వంటి సంస్థలను ఉదాహరణగా తెలిపాయి. క్యారీఫోర్‌ ఇక్కడ పూర్తి రిటైలర్‌గా విస్తరించాలనుకున్నా .. హోల్‌సేల్‌ వ్యాపారం ద్వారానే కార్యకలాపాలు ప్రారంభించాల్సి వచ్చింది. ఇది ఆ సంస్థ అంతర్జాతీయ వ్యాపార విధానాలకు అనుగుణంగా లేకపోవడం .. కంపెనీ కార్యకలాపాలకు ప్రతికూలంగా మారిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 

చదవండి👉 ముద్ద‌ ముట్ట‌ని పెంపుడు కుక్క‌లు, ప్రిన్స్‌ ఛార్లెస్‌ అవార్డు కార్యక్రమానికి ‘రతన్‌ టాటా’ డుమ్మా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement