దిక్కుతోచని స్థితిలో గిగ్‌ వర్కర్లు | Tough For Over Half Of Gig Workers To Find New Jobs | Sakshi
Sakshi News home page

దిక్కుతోచని స్థితిలో గిగ్‌ వర్కర్లు

Sep 8 2022 6:19 AM | Updated on Sep 8 2022 6:19 AM

Tough For Over Half Of Gig Workers To Find New Jobs - Sakshi

ముంబై: తాజా నైపుణ్యాలను అలవరుచుకోవడం లేదా కొత్త ఉపాధిని వెతుక్కోవడమనే సవాలును ఎదుర్కొంటున్నట్టు కాంట్రాక్టు పనివారు (గిగ్‌ వర్కర్లు) అభిప్రాయపడుతున్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో ఏర్పాటైన స్లార్టప్‌ ప్లాట్‌ఫామ్‌ సీఐఐఈ.కో ఒక నివేదికను విడుదల చేసింది. పనివాతావరణం తమకు సవాలుగా ఉన్నట్టు సర్వేలో పాల్గొన్న వర్కర్లలో 52 శాతం మంది చెప్పారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదంటే మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన సవాలును ఎదుర్కొంటున్నట్టు వీరు తెలిపారు.

స్వల్పకాల ఆదాయం కోసం ప్లాట్‌ఫామ్‌లలో కాంట్రాక్టు పనికోసం చేరిన వారు దీర్ఘకాలం పాటు, ఎటువంటి వృద్ధి లేకుండా కొనసాగాల్సి వస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ‘‘మేము అభిప్రాయాలు తెలుసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సమీప కాలంలో ఉద్యోగాలు మారే విషయమై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. అధిక వేళలపాటు పనిచేయాల్సి రావడం, నైపుణ్యాలను పెంచుకునే వాతావరణం లేకపోయినా కూడా మూడింట రెండొంతుల మంది ఉద్యోగాలు మారే విషయమై ప్రణాళికతో లేరు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. నైపుణ్యాల అంతరం దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.  

ఇలా అయితే నష్టం..  
యూనివర్సిటీల నుంచి వస్తున్న ఉద్యోగార్థులకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు మొదటి ఉద్యోగ వేదికలుగా ఉంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. వారు ఈ ఉద్యోగాలకే అతుక్కుపోయి నైపుణ్యాలు పెంచకోకుండా, మెరుగైన సంస్థల్లో కొలువులు పొందలేకపోతే.. అది మానవనరులను సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్‌ సుదుపాయం ఉన్నా కానీ, నేడు గిగ్‌ వర్కర్లలో 50 శాతం మంది రిఫరల్‌ రూపంలోనే పనిని పొందుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 4,070 మంది గిగ్‌ వర్కర్ల నుంచి సీఐఐఈ అభిప్రాయాలు తెలుసుకుని ఈ నివేదిక రూపొందించింది.  

Advertisement
 
Advertisement
Advertisement