మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్‌ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. | Telcos May Hike Tariff Charges After Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం

Mar 26 2024 10:02 AM | Updated on Mar 26 2024 10:30 AM

Telecom Cos May Hike Tariff Charges After Elections - Sakshi

టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్‌ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.

గత రెండేళ్లుగా ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థలు ఈసారి ఎలాగైనా వాటిని పెంచాలని యోచిస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను కనీసం 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్‌ నుంచి వచ్చే సరాసరి ఆదాయం(ఆర్పూ) పెంచుకోవడంలో భాగంగా మరోసారి తమపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయని తెలిసింది.

కొంతకాలం నుంచి టెలికాం కంపెనీలు టారిఫ్‌ల పెంపునకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నాయి. ఈమేరకు కంపెనీలు తమ ఇన్వెస్టర్ల సమావేశంలో పలుమార్లు టారిఫ్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అవి పూర్తి అయిన తర్వాత కంపెనీలు ఛార్జీల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. 

టారిఫ్‌ ప్లాన్లలో మార్పులు

ఎంట్రీ లెవల్‌ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు వివిధ ధరల్లో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టెలికం సంస్థలు ఇబ్బడిముబ్బడి టారిఫ్‌ ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నాయి. దీంతో తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెలవారి టారిఫ్‌ చెల్లింపులు భరించలేకపోతున్నారని వాదనలు వస్తున్నాయి. టెలికం సంస్థలు వీరికోసం ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

2021లో టారిఫ్‌లను పెంచిన టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయి. దాంతో కంపెనీల ఖర్చులు పెరిగాయి. ఆ వ్యయంలో కొంతమేర వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించబోతున్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: విమాన సంస్థల వేసవి షెడ్యూల్‌ విడుదల

Advertisement
 
Advertisement
Advertisement