ప్రయోగం నుంచి వినియోగం వైపు  | TCS, Infosys and Wipro double Copilot AI licences for employees | Sakshi
Sakshi News home page

ప్రయోగం నుంచి వినియోగం వైపు 

Jun 4 2026 12:27 AM | Updated on Jun 4 2026 12:27 AM

TCS, Infosys and Wipro double Copilot AI licences for employees

ఏఐ మోడల్స్‌ని ఉపయోగించడంలో ముందున్న ఐటీ కంపెనీలు 

లిస్టులో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో 

3 లక్షలకు పైగా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్‌ అందుబాటులో

న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్‌ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. 

తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్‌లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్‌ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్‌ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్‌ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్‌ సీఈవో కె. కృతివాసన్‌ తెలిపారు. 

సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు.  

కలిసి పని చేసే హైబ్రిడ్‌ విధానం.. 
ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్‌ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కి చెందిన వర్క్‌ ట్రెండ్స్‌ ఇండెక్స్‌ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్‌ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. 

కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్‌ టైమ్‌ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్‌ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్‌ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది.  దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది.

ఏఐ డీప్‌ఫేక్‌లతో వ్యాపారానికి రిస్కు
విప్రో వెల్లడి
ఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్‌ఫేక్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్‌గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్‌ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్‌లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది.  

కొన్ని సర్వీసులకు డిమాండ్‌ తగ్గుతుంది  
ఏఐ ఆటోమేషన్‌ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్‌ టూల్స్‌ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్‌ సర్వీసులకు డిమాండ్‌ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది.  ఒకవేళ ఏఐ ఎనబుల్డ్‌ సొల్యూషన్స్‌ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్‌ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది.

 విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్‌ దేశాల నుంచి, 27 శాతం యూరప్‌ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్‌లోని టెక్‌ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement