
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్గాట్గా కదులుతున్నాయి.
30 షేర్ల సెన్సెక్స్ 243 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 82,998 వద్ద, 50 షేర్ల నిఫ్టీ 83 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 25,327 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.31 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. ఇండియా వీఐఎక్స్ 0.7 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.8 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం లాభపడ్డాయి.
నేటి ఐపీవోలు
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, రమా టెలికాం, సన్టెక్ ఇన్ఫ్రా, సూపర్టెక్ ఈవీ ఐపీఓలు సబ్స్క్రిప్షన్ రెండో రోజులోకి ప్రవేశించనున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ, ఎల్లెన్ బారీ ఇండస్ట్రియల్ ఐపీఓ , కల్పతరు ఐపీఓ, ఐకాన్ ఫెసిలిటేటర్స్ ఐపీఓ, శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐపీఓ, అబ్రామ్ ఫుడ్స్ ఐపీఓ తమ సబ్ స్క్రిప్షన్ లో మూడో రోజుకు, ఏజేసీ జువెల్ మాన్యుఫాక్చరర్స్ ఐపీఓ 4వ రోజుకు ప్రవేశిస్తాయి.