క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ సునామీ.. సరికొత్త రికార్డ్ | Bitcoin Hits Fresh Record 124000 Dollars | Sakshi
Sakshi News home page

క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ సునామీ.. సరికొత్త రికార్డ్

Aug 15 2025 11:13 AM | Updated on Aug 15 2025 7:03 PM

Bitcoin Hits Fresh Record 124000 Dollars

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందింది. బిట్‌కాయిన్ విలువ అంతకు ముందుకంటే.. కూడా బాగా పెరిగింది. గురువారం ఆసియా వాణిజ్యంలో బిట్‌కాయిన్ వాల్యూ మొదటిసారిగా 124000 డాలర్లకు (రూ. 1,08,68,742) చేరింది. దీనికి యూఎస్ మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా.. క్రిప్టోకరెన్సీ రంగానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు మద్దతునిచ్చాయి.

డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన నియంత్రణ మార్పులు బిట్‌కాయిన్ పెరుగుదలకు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు క్రిప్టో సంస్థలతో పనిచేయకుండా నిరుత్సాహపరిచిన ఆంక్షలను.. ట్రంప్ ఉపసంహరించుకున్నందున, క్రిప్టో మార్కెట్ అత్యంత అనుకూలమైన ఫండమెంటల్స్‌తో కూడిన కాలాన్ని ఆస్వాదిస్తోంది" ఎక్స్ఎస్.కామ్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు 'సమీర్ హాస్న్' పేర్కొన్నారు.

ట్రంప్ మీడియా గ్రూప్ & ఎలాన్ మస్క్ టెస్లా వంటి కంపెనీలు భారీ మొత్తంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడంతో.. ఇతర పెట్టుబడిదారులు, సంస్థలు కూడా బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. ఈ కారణంగా బిట్‌కాయిన్‌కు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు బిట్‌కాయిన్‌ విలువ సుమారు 32 శాతం పెరిగింది. దీంతో నవంబర్ 2024లో 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ.. ఇప్పుడు 4.18 ట్రిలియన్ డాలర్లు దాటింది.

ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?

బిట్‌కాయిన్‌పై రాబర్ట్ కియోసాకి వ్యాఖ్యలు
డబ్బును పొదుపు చేయడం ఉత్తమ పెట్టుబడిదారుల లక్షణం కాదని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయాలని సూచించారు. అంతే కాకుండా బిట్‌కాయిన్‌పై ఇన్వెస్ట్ చేస్తే.. పేదవారు కూడా ధనవంతులు అవుతారని, శారీరక శ్రమ లేకుండానే ఆర్థికంగా ఎదుగుతారని పలుమార్లు సూచించారు.

వ్యూహాత్మకంగా స్పందించాలి
బిట్‌కాయిన్ చరిత్రాత్మకంగా రూ.1.03 కోట్ల గరిష్ట స్థాయికి చేరిన ఈ దశలో, ఇన్వెస్టర్లు భావోద్వేగాలపై కాకుండా వ్యూహాత్మకంగా స్పందించాలి. మార్కెట్‌లో స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ, ఫెడ్ రేట్ల మార్పులు వంటి స్థూల అంశాలు గాలి మార్పుల్లా ప్రభావం చూపగలవు. ఈ నేపథ్యంలో, డాలర్-కాస్ట్ యావరేజింగ్, ముందుగా నిర్ణయించిన రీబ్యాలెన్సింగ్, అత్యవసర లిక్విడిటీని క్రిప్టో వెలుపల ఉంచడం వంటి పద్ధతులు పెట్టుబడులను రక్షించడంలో కీలకంగా ఉంటాయి. ధరల హెచ్చుతగ్గులపై కాకుండా ప్రక్రియపై ఆధారపడే పెట్టుబడి విధానం దీర్ఘకాలిక విజయానికి మార్గం.
- విక్రమ్‌ సుబ్బరాజ్‌, సీఈవో, జియోటస్‌.కామ్‌

Advertisement
 
Advertisement
Advertisement