
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించడంతో మీడియా, టెక్ షేర్లలో లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలను ఆర్జించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 700.4 పాయింట్లు లేదా 0.85 శాతం పెరిగి 82,755.51 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా 200.40 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 25,244.75 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగాయి.
నిఫ్టీ మీడియా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు వరుసగా 1.99 శాతం, 1.64 శాతం, 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ 3.6 శాతం వరకు లాభపడ్డాయి. బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి, మార్కెట్ అస్థిరతను అంచనా వేయడానికి ఉపయోగించే భయ సూచిక ఇండియా వీఐఎక్స్ దాదాపు 5 శాతం పడిపోయి 12.96 పాయింట్లకు పడిపోయింది.