Stock Market: లాభాల స్వీకరణకు అవకాశం

Stock experts opinion on market movements - Sakshi

ప్రపంచ పరిణామాలే కీలకం

ట్రేడింగ్‌ నాలుగు రోజులే

ఫెడ్‌ ట్యాపరింగ్, కోవిడ్‌ వార్తలపై దృష్టి

ఈ వారం మార్కెట్‌ గమనంపై స్టాక్‌ నిపుణుల అభిప్రాయం  

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సెలవు. ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిఫ్టీ 17,350 స్థాయిని నిలుపుకుంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్‌ కొనసాగితే 17,500–17,600 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువ స్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,600 వద్ద మరో కీలక మద్దతు ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ తెలిపారు.

సూచీల కదలికకు ఇవే కీలకం..
దేశీయంగా స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని వారంటున్నారు. ఫెడ్‌ ట్యాపరింగ్, కరోనా కేసుల నమోదు వార్తలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారింవచ్చు.

సానుకూలతలూ ఉన్నాయ్‌...
జీడీపీతో సహా ఇటీవల కేంద్రం విడుదల విడుదలు చేసిన స్థూల ఆరి్థక గణాంకాలన్నీ మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ అంశాలతో అంతర్లీనంగా సెంటిమెంట్‌ సానుకూలంగానే ఉంది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశీయంగా అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో గతవారంలో సెన్సెక్స్‌ 2005 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 618 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే.  

భారత్‌ వైపు ఎఫ్‌ఐఐల చూపు ...  
భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌ విభాగంలో ఆగస్టు పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత్, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. డాలర్‌ రూపాయి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈక్విటీ మార్కెట్‌ అధిక విలువ వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ పరిణామాలను విదేశీ ఇన్వెస్టర్లు డెట్‌ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలుగా మలుచుకున్నారు. అని జియోజిత్‌ ఫైనాన్స్‌ సరీ్వసెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే విజయ్‌ కుమార్‌ తెలిపారు.  

పబ్లిక్‌ ఇష్యూ బాటలో వ్యాప్‌కోస్‌
జల్‌ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్‌కోస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్‌కోస్‌లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది.

ఇదే యోచనలో నేషనల్‌ సీడ్స్‌ : కాగా.. ఇదే ఐపీఓ బాటలోనే మరో పీఎస్‌యూ నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌సీ)లోనూ 25 శాతం వాటాను ఆఫర్‌ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రతిపాదించిన విషయం విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top