
అప్పుడే అందుకుతగ్గ వ్యాపార ప్రణాళికలు
స్టెల్లాంటిస్ ఇండియా సీఈవో హజేలా
ప్యారిస్: భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి స్థిరమైన, దీర్ఘకాల విధానాలు.. రాష్ట్రాల వ్యాప్తంగా ఏకరూపత అవసమని ఫ్రాన్స్కు చెందిన కార్ల తయారీ సంస్థ స్టెల్లాంటిస్ ఇండియా సీఈవో శైలేష్ హజేలా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆటోమొబైల్ కంపెనీలు దీర్ఘకాల దృష్టితో వ్యాపార ప్రణాళికలను అమలు చేయగలవన్నారు. జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల రూపంలో భారత మార్కెట్లో స్టెల్లాంటిస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
భారత్కు పెట్టుబడులతో వచ్చే వారు విధానాల పరంగా దీర్ఘకాల దృష్టిని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా సరే, దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా, దీర్ఘకాలం పాటు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఈవీలకు సంబంధించి, పన్ను పరమైన ఏకీకృత విధానాలు ఉండాలన్నారు. అప్పుడే కంపెనీలు రాష్ట్రాల వారీగా కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోగలవన్నారు. ఈవీలకు సంబంధించి రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అమలును ప్రస్తావించారు.
సిట్రెయెన్ బ్రాండ్ విస్తరణ
గత కొన్ని సంవత్సరాలుగా స్టెల్లాంటిస్ గ్రూప్ భారత్లో కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని శైలేష్ హజేలా తెలిపారు. ఇప్పుడు సిట్రోయెన్ బ్రాండ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. సేల్స్, నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో విక్రయ కేంద్రాలను రెట్టింపు చేసుకోనున్నట్టు (80 నుంచి 150కు) ప్రకటించారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారిస్తామన్నారు. టైర్4 పట్టణాల వరకు విస్తరిస్తామన్నారు. మార్కెట్ వాటాను వచ్చే 12 నెలల్లో రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. సిట్రోయెన్ బ్రాండ్పై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు స్టెల్లాంటిస్ ఈ ఏడాదిలో ప్రకటించడం గమనార్హం.