
ముంబై: నేడు (6న) దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 12,169 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,152 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీకే కట్టుబడటం, అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ పై పెరిగిన అంచనాల నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు 2-2.6 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. అయితే దేశీయంగా వరుసగా 4 రోజులు ర్యాలీ చేసిన నేపథ్యంలో నేడు మార్కెట్లలో కొంతమేర లాభాల స్వీకరణకు వీలున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లలో ఒడిదొడుకులకు చాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
4వ రోజూ జోరు
వరుసగా నాలుగో రోజు గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 724 పాయింట్లు జంప్చేసి 41,340కు చేరగా.. నిఫ్టీ 212 పాయింట్లు జమ చేసుకుని 12,120 వద్ద నిలిచింది. వెరసి సెన్సెక్స్ 41,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయిట్ల మైలురాళ్లను సులభంగా అధిగమించేశాయి. కేవలం 4 రోజుల్లోనే సెన్సెక్స్ 1,750 పాయింట్లను ఖాతాలో వేసుకోవడం విశేషం.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 12,055 పాయింట్ల వద్ద, తదుపరి 11,990 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,158 పాయింట్ల వద్ద, ఆపై 12,197 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 26,084 పాయింట్ల వద్ద, తదుపరి 25,854 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 26,459 పాయింట్ల వద్ద, తదుపరి 26,605 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) 5368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2208 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.