నేడు స్టాక్‌ మార్కెట్ల హైజంప్‌?!

SGX Nifty inidcates market may open with gapup - Sakshi

మార్కెట్ల గ్యాపప్ ఓపెనింగ్ చాన్స్

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 158 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,973-12,038 వద్ద రెసిస్టెన్స్‌!

2-4 శాతం మధ్య యూఎస్‌ మార్కెట్లు అప్‌

సానుకూలంగా ఆసియా మార్కెట్లు

పెట్టుబడుల బాటలోనే ఎఫ్‌పీఐలు

నేడు (5న) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 158 పాయింట్లు జంప్‌చేసి12,066 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ 11,908 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బుధవారం యూఎస్‌, యూరొపియన్‌ మార్కెట్లు 1.5-4 శాతం మధ్య ఎగశాయి.  ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం హుషారుగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు గ్యాపప్‌తో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే మూడు రోజులపాటు ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇంట్రాడేలో కొంతమేర లాభాల స్వీకరణకూ అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. 

మూడో రోజూ జోరు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో బుధవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 355 పాయింట్లు జంప్‌చేసి 40,616 వద్ద నిలిచింది. నిఫ్టీ 95 పాయింట్ల వృద్ధితో 11,909 వద్ద స్థిరపడింది. వెరసి 12,000 పాయింట్ల మార్క్‌ చేరువలో నిఫ్టీ ముగిసింది. ఇక గత 3 రోజుల్లో సెన్సెక్స్‌ 1,000 పాయింట్లను జమ చేసుకోవడం గమనార్హం! అయితే ఇంట్రాడేలో 40,693 ఎగువన గరిష్టానికి చేరిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌లో 40,077 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 11,930- 11,756 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,800 పాయింట్ల వద్ద, తదుపరి 11,692 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,973 పాయింట్ల వద్ద, ఆపై 12,038 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 25,312 పాయింట్ల వద్ద, తదుపరి 24,853 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 26,061 పాయింట్ల వద్ద, తదుపరి 26,351 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐలు ఓకే
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,274 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1101 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top