నేడు సానుకూల ఓపెనింగ్
15 పాయింట్లు బలపడిన ఎస్జీఎక్స్ నిఫ్టీ
నిఫ్టీకి 11,459-11,382 వద్ద సపోర్ట్స్!
బుధవారం యూఎస్ మార్కెట్ల దూకుడు
అధిక శాతం ఆసియా మార్కెట్లు లాభాల్లో
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(3న) సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 15 పాయింట్లు బలపడి 11,580 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,565 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బుధవారం యూఎస్ మార్కెట్లు తిరిగి చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. ప్రస్తుతం ఆసియాలో ఇండొనేసియా, సింగపూర్ మినహా మిగిలిన మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. కాగా.. జీడీపీ పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల నేపథ్యంలో రెండు రోజులుగా ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
చివరికి 39,000కు
వరుసగా రెండో రోజు బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు బలపడి 39,086 వద్ద నిలవగా.. నిఫ్టీ 65 పాయింట్లు పుంజుకుని 11,535 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,142 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,736 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ సైతం 11,555- 11,430 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చైనాతో సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,459 పాయింట్ల వద్ద, తదుపరి 11,382 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,583 పాయింట్ల వద్ద, ఆపై 11,631 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,597 పాయింట్ల వద్ద, తదుపరి 23,318 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,040 పాయింట్ల వద్ద, తదుపరి 24,205 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 657 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 775 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
మరిన్ని వార్తలు