మళ్లీ లాభాల్లోకి మార్కెట్‌

Sensex jumps 275 points and Nifty nears 12,850 - Sakshi

బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రయ్‌

సెన్సెక్స్‌ లాభం 282 పాయింట్లు 

12,850 పైన ముగిసిన నిఫ్టీ  

ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లను ఆర్జించి 12,859 వద్ద నిలిచింది. డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం తదితర  మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ కలిసొచ్చింది. చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 413 పాయింట్ల వరకు ఎగసి 44,013 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 12,892 – 12,771 రేంజ్‌లో కదలాడింది. మీడియా, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారంలో జరిగిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 439 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లను ఆర్జించాయి. శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3860.78 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  

రిలయన్స్‌ షేరుకు నాలుగో నష్టాలే...  
రిలయన్స్‌ షేరు వరుసగా నాలుగో రోజూ నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మేందుకే మొగ్గు చూపడంతో ఒక దశలో 4% నష్టపోయి రూ.1895 వద్ద రూ.1895 కనిష్టాన్ని తాకింది. చివరికి 3.50% క్షీణించి రూ.1899 వద్ద స్థిరపడింది. ఇండస్‌ టవ ర్స్, భారతీ ఇన్ఫ్రాటెల్‌ టవర్ల వ్యాపార విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించడంతో ఎయిర్‌టెల్‌ షేర్లు 3% లాభంతో రూ.483.50 వద్ద ముగిసింది.  

గ్లాండ్‌ ఫార్మా లిస్టింగ్‌... గ్రాండ్‌!
ముంబై: ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్‌ ఫార్మా స్టాక్‌ మార్కెట్‌ అరంగ్రేటం అదిరిపోయింది. ఇష్యూ ధర (రూ.1,500)తో పోలిస్తే బీఎస్‌ఈలో 13 శాతం లాభంతో రూ.1,701 వద్ద లిస్ట్‌య్యింది. కరోనా రాకతో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజక్టబుల్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఆçసక్తి చూపారు. ఒక దశలో 23 శాతం పెరిగి రూ.1,850 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరికి 21 లాభంతో రూ.1,820 వద్ద ముగిశాయి. హైదరాబాద్‌ ఆధారిత ఈ గ్లాండ్‌ ఫార్మా కంపెనీ రూ. 1,500 ధరతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ఈ నెల 9న ప్రారంభమై 11న ముగిసిన ఐపీఓ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,480 కోట్లను సమీకరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top