
ఇరాన్–ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందం అతిక్రమణ
ఆరంభ లాభాలు ఆవిరి...
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,121 పాయింట్లు జంప్
158 పాయింట్ల లాభంతో ముగింపు
25,000 స్థాయిపైనే నిఫ్టీ
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటంతో దేశీయ స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మంగళవారం ఇంట్రాడేలో 1,121 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ ఆఖరికి 158 పాయింట్ల స్వల్ప లాభంతో 82,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ప్రథమార్థంలో కొనుగోళ్ల జోరు కనిపించింది ఒక దశలో సెన్సెక్స్ 1,121 పాయింట్లు ర్యాలీ చేసి 83,018 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు దూసుకెళ్లి 25,318 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అయితే ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ క్షిపణులతో దాడులు చేస్తూందంటూ ఇజ్రాయెల్ ఆరోపణలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు – 2–3% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.
⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2%, టెలికమ్యూనికేషన్, మెటల్, ఫైనాన్షియల్ సర్విసెస్, బ్యాంకెక్స్ ఇండెక్సులు ఒకశాతం పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75%, 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.
సూచీలకు అదానీ షేర్ల దన్ను...
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి. వివిధ వ్యాపారాలపై వచ్చే అయిదేళ్లలో 15–20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ లభించింది. అంబుజా సిమెంట్స్ 4%, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, అదానీ పోర్ట్స్ 2.60%, ఏసీసీ, అదానీ ఎనర్జీ 2% లాభపడ్డాయి.
⇒ బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఆయిల్ మార్కెట్ కంపెనీలు, ఏవియేషన్, పెయింట్స్, అడెషివ్స్ షేర్లకు కలిసొచ్చింది. హెచ్పీసీఎల్ 3%, ఐఓసీ, బీపీసీఎల్ 2% లాభపడ్డాయి. ఇండిగో ఏవియేషన్ 2.5%, స్పైస్జెట్ 2.15% పెరిగాయి. కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, షాలీమార్ పెయింట్స్ 2% లాభపడ్డాయి.