భవిష్యత్తులో పరిస్థితులు స్థిరంగా ఉండొచ్చనే అంచనాలతో భారత్కు ’బీబీబీ’ సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. పాలసీపరంగా స్థిరత్వాన్ని పాటిస్తూ, మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతూ భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా నిలుస్తోందని వివరించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత గతేడాదే భారత్ రేటింగ్ని ఎస్అండ్పీ ‘బీబీబీ మైనస్’ నుంచి ‘బీబీబీ’కి అప్గ్రేడ్ చేసింది.
‘బీబీబీ’ని పెట్టుబడులు పెట్టతగిన ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్గా పరిగణిస్తారు. అయితే, ఈ రేటింగ్ ఉన్న దేశాలకు.. తాము తీసుకున్న నిధులను తిరిగి చెల్లించేందుకు తగినంత సామర్థ్యాలు ఉన్నప్పటికీ, అధిక రేటింగ్ ఉన్న దేశాలతో పోల్చినప్పుడు, ఏవైనా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు తలెత్తితే తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితులు ఉంటాయి.
వచ్చే 2–3 ఏళ్లలో ప్రభుత్వ పెట్టుబడులు, వినియోగదారుల డిమాండ్ తదితర అంశాలు భారత్ అధిక వృద్ధి అవకాశాలకు దన్నుగా నిలుస్తాయని ఎస్అండ్పీ తెలిపింది. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక కమ్రశిక్షణకు ఊతమిచ్చేలా విధానాలను స్థిరంగా కొనసాగించవచ్చని భావిస్తున్నట్లు వివరించింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ లోక్సభలో బీజేపీకి మెరుగైన మెజార్టీ ఉండటమనేది ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వానికి కలిసి వచ్చి అంశమని ఎస్అండ్పీ తెలిపింది.
అధిక ఇంధన ధరలు, వ్యవసాయ రంగంలో కఠినతరమైన పరిస్థితుల వల్ల భారత్ వృద్ధి స్వల్పంగా నెమ్మదించే అవకాశం ఉందని కాకపోతే ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉంటూ, వచ్చే రెండు మూడేళ్లలో భారీ వృద్ధి సాధనకు దోహదపడగలవని వివరించింది. రుణభారం, ఆర్థికంగా కొంత బలహీన పనితీరు, తలసరి ఆదాయం తక్కువగా ఉండటంలాంటి అంశాలు భారత్కి కొంత ప్రతికూలంగా ఉండొచ్చని ఎస్అండ్పీ తెలిపింది.


