ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!

REVOS offers EV charging points at a launch price of RS 1 - Sakshi

ప్రజలకు రెవోస్ కంపెనీ శుభవార్త తెలిపింది. మరో ఆదాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం రెవోస్ కంపెనీ అద్భుతమైన ఆఫర్ మీ ముందు ఉంచింది. పోర్టబుల్ ఛార్జర్లకు అనుకూలమైన ఛార్జింగ్ పాయింట్లను ఇక ఎవరైనా కొనుగోలు చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు అని తెలిపింది. యూనియన్ స్క్వేర్ వెంచర్స్ మద్దతు గల రెవోస్ కంపెనీ బోల్ట్ పేరుతో ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. దీనిని ఎవరైనా కొనుగోలు చేసి దుకాణాలు, గ్యారేజీలు, వాణిజ్య పార్కింగ్ స్థలాల వద్ద ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లు పోర్టబుల్ ఛార్జర్లు ఇంటి వద్ద ప్రస్తుతం ఉన్న ఎసీ పవర్ సప్లైతో కూడా ఇవి పనిచేస్తాయి. ఈ ఛార్జింగ్ పాయింట్లను సాధారణంగా అయితే ₹3,000కు కొనుగోలు చేసి ఛార్జింగ్ పాయింట్ తెరవవచ్చు. అయితే, ఆఫర్ లో భాగంగా కంపెనీ అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ చివరి వరకు ₹1 ప్రారంభ ధరకు బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లను అందిస్తోంది. 

ఎనర్జీ కాలిక్యులేటర్
ఛార్జింగ్ యూనిట్లు, పవర్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఎనర్జీ కాలిక్యులేటర్ తో ఈ పాయింట్స్ వస్తాయి. అలాగే, ఛార్జింగ్ పాయింట్ పక్కన ఉంచిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కస్టమర్ బిల్లు చెల్లింపులు కూడా చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఛార్జర్ సెట్ చేయడానికి అయ్యే ప్రాథమిక ఖర్చు తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఇతర ఖర్చులను వసూలు చేయడం లేదు. ప్రీ లాంఛ్ దశలో కంపెనీ భారతదేశంలోని 60 నగరాల్లో సుమారు 2,000 ఛార్జింగ్ పాయింట్లను 3,600 కెడబ్ల్యు సామర్థ్యం గల పాయింట్స్ ఇన్ స్టాల్ చేసింది. రెవోస్ బోల్ట్ మొబైల్ యాప్ ఉపయోగించి ఈవీ యజమానులు ఛార్జింగ్ పాయింట్లను గుర్తించవచ్చు.

ఆర్ఈవీవోఎస్ సహ వ్యవస్థాపకుడు జ్యోతిరంజన్ హరీచందన్ బిజినెస్ లైన్తో మాట్లాడుతూ.. "మా ఛార్జింగ్ పాయింట్లు ఒక గంటలో ప్రతి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫుల్ ఛార్జ్ చేయగలవు. అంత సామర్థ్యం ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలకు లేదు. ప్రస్తుతం మాతో కొన్ని ఓఈఎమ్ లు పనిచేస్తున్నాయి. వారు తమ ఈవీలను 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే, ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పట్టే ఇతర ఈవీలు కూడా ఉన్నాయి. ఇది ఈవీ బ్యాటరీ టెక్నాలజీ, పోర్టబుల్ ఛార్జర్ పై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు. (చదవండి: యాపిల్‌ నెంబర్‌ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్‌..!)

యూరప్, ఆగ్నేయ ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో త్వరలో ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో, ఆర్ఈవీవోఎస్ భారతదేశంలోని 500 నగరాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో 1 మిలియన్ బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లకు పైగా ఇన్ స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెవోస్ కంపెనీని యాదవ్, హరిచందన్ 2017లో స్థాపించారు. యూనియన్ స్క్వేర్ వెంచర్స్, ప్రైమ్ వెంచర్ పార్టనర్స్ నుంచి కంపెనీ 4.5 మిలియన్ డాలర్ల నిధులను ఇప్పటికే సేకరించింది. బెంగళూరు, సింగపూర్లలో కార్యాలయాలను కలిగి ఉంది.
 

రెవోస్ సహవ్యవస్థాపకుడు మోహిత్ యాదవ్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య వేగంగా పెరిగాలి అంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. గతంలో దేశ వ్యాప్తంగా ఉన్న పసుపు పచ్చ ఫోన్ బాక్స్ మాదిరిగానే, ప్రస్తుతం దేశం నలుమూలల ఆకుపచ్చ బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు" తెలిపారు. కంపెనీ బోల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అభివృద్ది చేసింది. ఇది పేటెంట్ పెండింగ్ మాడ్యులర్ సిస్టమ్, ఇది ఏదైనా ఈవీతో ఇంటిగ్రేట్ చేయబడుతుంది. 

(చదవండి: ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి మరో మొబైల్ దిగ్గజ కంపెనీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top