బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పేదవాడి బంగారంగా పిలిచే వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్దికాలంగా వెండి ధరలు ఎగబాకుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం ఏమిటనే ప్రశ్నలొస్తున్నాయి. డిమాండ్కు సరిపడా వెండి సరఫరా కావడంలేదనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు వెండిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుందాం.
ధరల పెరుగుదలకు కారణం
వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో వెండి సరఫరా కంటే డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ సిల్వర్ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొరత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
డిమాండ్ ఎందుకు పెరిగింది?
బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే, రేకులుగా మలిచే గుణం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.
ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీ
బంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.
ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధన
ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.
వైద్య పరికరాలు
బంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.
నానోటెక్నాలజీ
బంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.
గ్లాస్, కిటికీలు
కొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు
ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.
ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు
వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.
పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలు
వెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.
నీటి శుద్ధి, వైద్య రంగం
వెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.
ఫొటోగ్రఫీ
సాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.
సరఫరా ఎందుకు లేదు?
వెండి అనేది ఒక ఉప ఉత్పత్తి (By-product) లోహం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో సుమారు 70% కంటే ఎక్కువ భాగం ప్రధానంగా రాగి, సీసం, జింక్, బంగారం వంటి ఇతర లోహాల మైనింగ్ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.
ప్రధాన లోహాల మైనింగ్పై పెట్టుబడులు తగ్గడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉప ఉత్పత్తిగా లభించే వెండి పరిమాణం కూడా తగ్గిపోతుంది.
వెండిని ప్రధానంగా ఉత్పత్తి చేసే గనుల్లో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ భూమిలో ఉన్న వెండి శాతం (గ్రేడ్) తగ్గిపోతోంది. అంటే ఒకే పరిమాణంలో వెండిని పొందడానికి ఎక్కువ ఖర్చుతో అధిక మట్టిని తవ్వాల్సి వస్తుంది.
ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెండిని తిరిగి తీయడం (రీసైక్లింగ్) ఖర్చుతో కూడుకుంది. దీని వల్ల మొత్తం సరఫరాపై ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదు.
వెండి కేవలం సంప్రదాయ ఆభరణాల లోహం కాకుండా ఆధునిక సాంకేతికతకు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్కు కీలకమైన పారిశ్రామిక ముడిసరుకుగా మారింది. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి భవిష్యత్తు సాంకేతికతలపై పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దీనికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో మైనింగ్ నుంచి లభించే సరఫరా పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ - సరఫరా మధ్య అంతరం మరింత అధికమవుతోంది. ఈ అసమతుల్యతే వెండి ధరలను పెంచేందుకు దోహదం చేస్తుంది.
ఇదీ చదవండి: దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు


