సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
ఇటీవల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య బలపడుతున్న నేపథ్యంలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పెట్టుబడుల రక్షణకు టెక్ సేవలను అధికంగా వినియోగించనున్నట్లు తెలియజేశారు. వెరసి టెక్నాలజీ ఆధారిత సర్వీసుల ద్వారా ఐపీవో పెట్టుబడులకుముందు జరుగుతున్న మోసాలను నివారించనున్నట్లు తెలియజేశారు. దీంతో రిజిస్టర్ ఇంటర్మీడియరీల జోక్యంలేకుండానే ఇన్వెస్టర్ల పెట్టుబడులు దారి మళ్లుతుండటాన్ని అడ్డుకోనున్నట్లు వెల్లడించారు. సెబీ చైర్మన్గా మార్చి 1కల్లా ఏడాది కాలం పూర్తి చేసుకున్న పాండే పలు అంశాలపై స్పందించారు.
నకిలీ యాప్స్ ఎఫెక్ట్
మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్న పలువురు కొత్త ఇన్వెస్టర్లను అత్యధిక రిటర్నుల ఆశ చూపుతూ నకిలీ ట్రేడింగ్ యాప్స్, వాట్సాప్ గ్రూప్లు మోసం చేస్తున్నట్లు పాండే పేర్కొన్నారు. వీటితో మదుపరులను తప్పుదారిపట్టిస్తూ వారి సొమ్మును మోసగాళ్ల వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి ఇన్వెస్టర్లలో అప్రమత్తతను, అవగాహనను పెంచవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేయదలచిన రిటైల్ ఇన్వెస్టర్లను మోసగాళ్లు సెబీ వద్ద రిజిస్టరైన ఇంటర్మీడియరీలకు తెలియకుండానే సొమ్మును దారిమళ్లిస్తున్నట్లు వివరించారు. అత్యున్నత ఆర్జన ఆశచూపి మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకు వాట్సాప్ గ్రూప్లు, నకిలీ యాప్స్, తదితర డిజిటల్ చానళ్ల ద్వారా వలపన్నుతున్నట్లు తెలియజేశారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమైనట్లు ప్రస్తావించారు. పెట్టుబడులకు దిగేముందు ఆయా సంస్థల గుర్తింపును ధృవీకరించుకునేందుకు సెబీ చెక్ తదితర టూల్స్ను వినియోగించుకోవడం ప్రయోజనకరంకాగలదని ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి పలు చర్యల ద్వారా విస్తారంగా ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచవలసి ఉన్నదని, తద్వారా మాత్రమే సైబర్ మోసాలకు చెక్ పెట్టగలమని వివరించారు.
ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు


