పోర్ట్ఫోలియో క్రమబద్ధీకరణలో భాగంగా జపనీస్ అగ్రిమెషనరీ బిజినెస్ నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) వెల్లడించింది. వ్యూహాత్మక సమీక్ష ప్రభావంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. జపాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిత్సుబిషీ మహీంద్రా అగ్రికల్చరల్ మెషీనరీ(ఎంఏఎం) బోర్డు వ్యవసాయ రంగ మెషీనరీ బిజినెస్ నుంచి తప్పుకునేందుకు అనుమతించినట్లు తెలియజేసింది.
అయితే వీటికి సంబంధించిన విడిభాగాలు, ఉత్పత్తుల వారంటీ సర్వీసులను కొనసాగించనున్నట్లు పేర్కొంది. అక్కడి చట్టాల ప్రకారం ఎంఏఎం మూసివేత, లిక్విడేషన్ ప్రక్రియకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. లాభదాయక స్థితిని సాధించేందుకు పలురకాల వ్యవస్థాగత చర్యలు చేపట్టినప్పటికీ నష్టాలు వాటిల్లుతూనే ఉన్నట్లు వెల్లడించింది.
దీంతో బిజినెస్ దీర్ఘకాలిక నిర్వహణ, ఆర్థికంగా కొనసాగగలిగే పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక భవిష్యత్లో నిలకడగా బిజినెస్ను కొనసాగించడం సవాలేనని నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది. లిక్విడేషన్ ప్రక్రియ ముగిశాక నష్టాలకు ప్రమోటర్ గ్రూప్ ఫండింగ్ను చేపడుతుందని తెలియజేసింది. వెరసి 2027 తొలి అర్ధభాగంలో అగ్రికల్చరల్ మెషీనరీ తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు


