భారత వైమానిక దళానికి సరఫరా చేసే సీ-390 మిలీనియం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా బ్రెజిలియన్ సంస్థ ఎంబ్రేయర్తో దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్ చేతులు కలిపింది. లోకలైజేషన్ వ్యూహంలో భాగంగా నెలకొల్పే ఈ కేంద్రంలో టెస్టింగ్, తనిఖీ, విడిభాగాల రిపేర్, శిక్షణ తదితర సర్వీసులన్నీ అందిస్తుందని ఎంబ్రేయర్, మహీంద్రా తెలిపాయి.
ఎంబ్రేయర్కి చెందిన సీ-390 మిలీనియం మల్టీ-మిషన్ మిలిటరీ రవాణా విమానాలను భారత్లో తయారు చేసేందుకు ఇరు సంస్థలు గతేడాది అక్టోబర్లో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇతర మధ్యస్థాయి మిలిటరీ రవాణా విమానాలతో పోలిస్తే సీ-390 అత్యధిక వేగం, రేంజి, 26 టన్నుల వరకు పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సరుకు, బలగాల రవాణా, సెర్చ్ ఆపరేషన్లు మొదలైన అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.


