
యాక్సిస్, ఐడీబీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: నిబంధనల ఉల్లంఘనలపై ప్రయివేట్ రంగ సంస్థలు యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్లకు ఆర్బీఐ జరిమానాలు విధించింది. కేవైసీ సంబంధ మార్గదర్శకాలతోపాటు వివిధ నిబంధనలు పాటించకపోవడంతో యాక్సిస్ బ్యాంకుకు రూ. 93 లక్షల పెనాల్టీ విధించింది. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంకును సైతం రూ. 90 లక్షల ఫైన్ కట్టమంటూ ఆదేశించింది.
యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ అంశంలో చార్జీల విధింపు, కేవైసీ మార్గదర్శకాలు తదితరాలలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక, మోసాల విషయంలో వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సంస్థలు పాటించాల్సిన వర్గీకరణ, రిపోర్టింగ్ నిబంధనలను పాటించనందుకు గాను ఐడీబీఐ బ్యాంక్కు పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
కార్పొరేట్ కస్టమర్లు, స్పాన్సర్ బ్యాంకుల మధ్య చెల్లింపుల వ్యవస్థ నియంత్రణను పటిష్టపరచడంలో మార్గదర్శకాల ఉల్లంఘన సైతం వీటిలో ఉన్నట్లు వివరించింది.