‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’ - రాజీవ్‌ బజాజ్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’ - రాజీవ్‌ బజాజ్‌ కీలక వ్యాఖ్యలు

Published Sat, Oct 30 2021 9:36 AM

Rajeev Bajaj Crucial Comments On Startups - Sakshi

పుణె: ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో స్టార్టప్స్‌ సంస్థలు కుప్పతెప్పలుగా వస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశీ టూ–వీలర్‌ దిగ్గజాలను అంత తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ‘ఏవో కొన్ని స్టార్టప్‌లు అనుకుంటున్నట్లుగా మంచి భారతీయ ద్విచక్ర వాహన కంపెనీలు మరీ అంత తేలికైనవి కాదు. మేము అక్టోబర్‌లో మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తే.. మీకు నవంబర్‌లో చేతికి అందుతుంది. అంతే గానీ 2021లో ఆవిష్కరిస్తే డెలివరీ తీసుకునేందుకు మీరు 2022 దాకా వేచి చూస్తూ కూర్చోనక్కర్లేదు. అది స్టార్టప్‌లు పనిచేసే తీరు. చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజాల పనితీరు అలా ఉండదు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. 

డార్విన్‌ సిద్ధాంతం
150 సీసీ మించిన స్పోర్ట్స్‌ మోటర్‌సైకిల్స్‌ విభాగంలో ఎన్‌ఫీల్డ్, బజాజ్, టీవీఎస్‌లకు 70–80 శాతం మార్కెట్‌ వాటా ఉంటుందన్నారు. సరికొత్తగా పల్సర్‌ 250ని ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్‌ ఈ విషయాలు రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో స్టార్టప్‌ల నుంచి బడా కంపెనీలకు పోటీ ఎదురయ్యే అంశంపై స్పందిస్తూ.. చార్లెస్‌ డార్విన్‌ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అత్యంత తెలివైన, బలమైన జీవి కాకుండా మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగించగలవని, సంస్థలకు కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement