ఇండియా & ఖతార్లలో.. మ్యూజియం ఇన్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్లను అభివృద్ధి చేయడానికి ఖతార్ మ్యూజియమ్స్ - ముంబై కేంద్రంగా ఉన్న నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) మధ్య ఐదు సంవత్సరాలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఖతార్ మ్యూజియమ్స్ చైర్పర్సన్ షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం.. ఖతార్లలో మ్యూజియం ఇన్ రెసిడెన్స్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీని ద్వారా పిల్లలకు ఉల్లాసభరితమైన, మ్యూజియం ఆధారిత అభ్యాస అనుభవాలను పరిచయం చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం సృజనాత్మకతను ప్రేరేపించడం. మన దేశంలో ఈ కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో.. NMACC అమలు చేస్తుంది. కాగా ఖతార్ మ్యూజియమ్స్ నిపుణులు.. మాస్టర్ క్లాసులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించనున్నారు.
ఈ సందర్బంగా ఇషా అంబానీ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు & విద్యాభివృద్ధి కోసం షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరియు ఖతార్ మ్యూజియంలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ భాగస్వామ్యంతో నిర్వహించనున్న కార్యక్రమాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలతో సహా పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ కేంద్రాలలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.


