తటస్థ విధానానికే ఓటు
ఎంఎస్ఈలకు రూ. 20 లక్షల రుణసాయం
బ్యాంక్ కస్టమర్ మోసపోతే రూ.25వేల పరిహారం
రీట్లకు ఇకపై బ్యాంక్ రుణాలు
ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలు
ముంబై: అంచనాలకు అనుగుణంగా కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితినే కొనసాగించింది. బడ్జెట్లో మూలధన వ్యయాలు పెంచడంతో వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉంటుందన్న అంచనాలు వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా అనిశి్చతుల నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు చేపట్టకుండా తటస్థ వైఖరిని కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను పెంచింది.
బ్యాంకు కస్టమర్లు మోసపోతే తక్షణ పరిహారం కింద రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం ఖాతాదారులకు ఊరటనిచ్చేది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) సైతం బ్యాంక్ల నుంచి రుణ వితరణకు పచ్చజెండా ఊపింది. ఎంఎస్ఈలకు పూచీకత్తులేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం మరో కీలక నిర్ణయం. అలాగే, కొన్ని రకాల ఎన్బీఎఫ్సీలకు సైతం నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించింది.
పాలసీలోని ముఖ్యాంశాలు..
→ రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంక్లు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత డిసెంబర్ సమీక్షలో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించడం తెలిసిందే.
అంతేకాదు 2025 ఫిబ్రవరి నుంచి మొత్తం మీద రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడం గమనార్హం. రివర్స్ రెపో (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే రేటు) రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) 5.50 శాతం రేట్లలోనూ మార్పు చేయలేదు.
→ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో 2.1 శాతంగా (గత అంచనా 2 శాతం) కొనసాగుతుందని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. 2025–26 క్యూ4లో 3.2 శాతం (గత
అంచనా 2.9 శాతం), 2026–27 క్యూ1లో 4 శాతానికి, 2026–27 క్యూ2లో 4.2 శాతానికి పెరుగుతుందని అంచనాలకు వచి్చంది. 2026–27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను తదుపరి ఏప్రిల్ సమీక్ష సందర్భంగా ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) క్యూ1 (ఏప్రిల్–జూన్), క్యూ2 (జూలై–సెప్టెంబర్) వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. రియల్ జీడీపీ సిరీస్ను ఈ నెల చివర్లో విడుదల చేయనుండడంతో పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏప్రిల్లో ప్రకటిస్తామని మల్హోత్రా పేర్కొన్నారు.
→ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) ఆర్థిక భరోసా కల్పిస్తూ పూచీకత్తు లేని రుణ
పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకునే రుణాలతోపాటు గత రుణాల పునరుద్ధరణలకూ ఇది వర్తిస్తుంది.
→ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) బ్యాంకుల రుణ వితరణను అనుమతించే ప్రతిపాదనను ఆర్బీఐ ఎంపీసీ తీసుకొచి్చంది. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత రుణ వితరణను ప్రోత్సహించేందుకు వీలుగా కొన్ని రక్షణ చర్యలతో రీట్లకు బ్యాంకుల రుణాలను అనుమతించే ప్రతిపాదన చేసింది.
→ కార్పొరేట్ బాండ్ల మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా.. 2026–27 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా, కార్పొరేట్ బాండ్ సూచీల డెరివేటివ్స్కు నియంత్రణ పరమైన కార్యాచరణను ఆర్బీఐ విడుదల చేయనుంది.
→ తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది.
ఎన్బీఎఫ్సీలకు వెన్నుదన్ను
రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రజల నుంచి నిధులు సమీకరించని వాటిని కొన్ని షరతుల మేరకు తప్పనిసరి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆబీఐ ఎంపీసీ ప్రతిపాదించింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు–ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు (ఐసీసీలు), 1,000 శాఖలకు మించి ఉన్నవి కొత్త శాఖల విస్తరణకు ఇకపై ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇక బంగారం రుణాల విషయంలో ఎంలాంటి ఆందోళనల్లేవని, సౌకర్యంగానే ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆస్తుల లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ/ బంగారం ధరపై రుణ వితరణ) తాము నిర్దేశించిన పరిమితులకు దిగువనే ఉన్నట్టు చెప్పారు. బంగారంపై రుణాలు సహా ఎన్బీఎఫ్సీల రుణాల పోర్ట్ఫోలియోలను ఆర్బీఐ సమీక్షించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026–27లో రుణ సమీకరణను రూ.17.2 లక్షల కోట్లకు పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నికర రుణ సమీకరణను చూడాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.20,000 కోట్లే ఎక్కువన్నారు.
డిజిటల్ మోసాలకు పరిహారం
బ్యాంక్ కస్టమర్ ప్రమేయంతో, ఓటీపీ తెలుసుకుని లేదా కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే డిజిటల్ మోసాల్లో ఎలాంటి ప్రశ్నలు లేకుండా బ్యాంక్ రూ.25,000ను పరిహారం కింద చెల్లిస్తుంది. కాకపోతే కస్టమర్ ఉద్దేశపూర్వక పాత్ర ఉండకూడదు. కస్టమర్ తన వంతుగా 15 శాతం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక విలువ కలిగిన మోసాల్లో పరిహారం రూ.25 వేలకు పరిమితం అవుతుంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.


